Movie News

రేపు పిఠాపురంలో వరుణ్ తేజ్ పర్యటన

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రేపు పిఠాపురంలో జనసేన తరుపున ప్రచారం చేయబోతున్నారు. మే 13 న ఏపీలో అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్..కూటమితో చేతులు కలిపి బరిలోకి దిగారు. టిడిపి , జనసేన, బిజెపి కలిసి పొత్తుగా పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఇక పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందారు.

ఈసారి పిఠాపురం నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి పవన్ విజయాన్ని ఎవ్వరు ఆపలేరంటున్నాయి సర్వేలు. ఇప్పటికే పిఠాపురంలో పర్యటించిన పవన్..మిగతా స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తూ వస్తున్నారు.

ఇటు పిఠాపురంలో ఇప్పటికే నాగబాబు, జానీ మాస్టర్, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను తదితరులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేపు (ఏప్రిల్ 27) పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారానికి రానున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరుణ్ తేజ్ బాబాయ్ కోసం ప్రచారం చేపట్టనున్నారు. వరుణ్ తేజ్ రోడ్ షోలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది.