Movie News

ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను-శిరీష్ రెడ్డి

తెలుగు సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్వీసీ సంస్థకు, రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చరణ్ గారికి నాకు మంచి అనుబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయన్ని అవమానపరచడం గాని, కించపరచడం గాని నా జన్మలో ఎప్పుడూ చేయను.

నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి నిజంగానే క్షమాపణలు చెబుతున్నాను. చరణ్ గారికి కూడా క్షమాపణలు చెబుతున్నాను. చరణ్ గారితో నాకు ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌ను పాడుచేసుకోదల్చుకోలేదు. ఈరోజు జనం మాట్లాడుకుంటున్న మాటలు, బయట ట్రోలింగ్, అభిమానుల బాధలు నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరూ భరించలేరు. నేను అన్న ఇంటెన్షన్ అది కాదు. మాకున్న రిలేషన్‌షిప్ క్లోజ్‌నెస్‌లో నేను మాట దొర్లాను తప్పా ఆయన్ని అవమానపరచడానికి కాదు.

మెగా హీరోలందరితోనూ మాకు మంచి అనుబంధం ఉంది. వరుణ్ తేజ్ గారితో ‘ఫిదా’ చేశాం. సాయితేజ్ గారితో రెండు సినిమాలు చేశాం. చరణ్ గారితో రెండు సినిమాలు చేశాం. చిరంజీవి గారు దిల్ రాజు గారితో, మాతో మాట్లాడుతూనే ఉంటారు. ఇంత మంచి అనుబంధం ఉన్నవారిని అవమానపరిచే అంత మూర్ఖుడిని కాదు. దయచేసి అభిమానులందరూ అర్థం చేసుకోవాలి.

సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చరణ్ గారు ఒప్పుకోకపోతే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆయన మనసు గొప్పది కాబట్టి ఆ సినిమాను కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి చరణ్ గారు. ఆయన్ని ఎందుకు అవమాన పరుస్తాం. నా మాటల్ని అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాను. ఫ్యాన్స్ కి క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి మా రిలేషన్‌ను పాడు చేయొద్దు. మళ్లీ నెక్స్ట్ ఒక ప్రాజెక్టు రెడీ అయింది. నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు తీసుకురావద్దని అందర్నీ వేడుకుంటున్నాను.

తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. నాకు చరణ్ గారితో మంచి రిలేషన్ ఉంది. ఆయన గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను కాబట్టి, నాకు తెలియకుండా ఏదైనా మాట దొర్లిందేమో. అది కూడా అర్థం చేసుకోవాలని అందరిని కోరుతున్నాను. థాంక్యూ వెరీ మచ్.