Movie News

శివాజీకి ..పవన్ వార్నింగ్

సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..గతంలో వార్నింగ్ ఇచ్చిన విషయాన్నీ నటుడు శివాజీ రాజా తెలిపి..వార్తల్లో నిలిచాడు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా మాట్లాడుతూ.. మీ టూ ఉద్యమం జరుగుతున్న సమయంలో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు చేసిందన్నారు. అక్కడితో ఆగకుండా ఫిలిం ఛాంబర్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నానా రచ్చ చేసిందని శివాజీ రాజా అన్నారు. ఆ సమయంలో మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’కు తానే అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తుచేశారు.

శ్రీరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఓ రోజు పవన్ కళ్యాణ్ ‘మా’ ఆఫీస్‌కు వచ్చారని.. ఆ సమయంలో నేను, నాగశౌర్య నర్తనశాల షూటింగ్‌లో ఉంటె.. మా ఆఫీస్ వద్దకు రమ్మంటూ పవన్ పిలిపించారని .. తాను అక్కడికి వెళ్లేసరికే పవన్ కోపంతో ఊగిపోతున్నారని, అలా ఆయనను ఎప్పుడూ చూడలేదని శివాజీ రాజా అన్నారు. నాకు అన్యాయం జరిగింది ఎవరు సమాధానం చెబుతారు.. రాఘవేంద్రరావుకు, సురేష్ బాబుకి ఫోన్ చేయ్ అని చెప్పారని.. అయితే వారిద్దరూ అందుబాటులో లేరని ఆయనకి చెప్పానని.. ఆ వెంటనే నువ్వు ఈసారి మా ప్రెసిడెంట్ ఎలా అవుతావో చూస్తానని పవన్ కళ్యాణ్ నాకు వార్నింగ్ ఇచ్చారని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత పవన్ 20 మంది లాయర్లను తీసుకొచ్చాడని.. కొందరితో కలిసి ఐజీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశానని అది చెప్పినా వినే పరిస్ధితుల్లో పవన్ కళ్యాణ్ లేరని శివాజీ తెలిపారు. ఇంత చేసినా నువ్వు నాకోసం ఏం చేశావని పవన్ కళ్యాణ్ నిలదీయడం నన్ను బాధపెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ గొడవ నేపథ్యంలో నాగబాబు కూడా తనతో మాట్లాడటం మానేశారని శివాజీ తెలిపాడు.