Movie News

విచారణకు హాజరు కావాలంటూ హీరో రాజ్ తరుణ్ కు నోటీసులు

మాజీ ప్రేయసి లావణ్య ఫిర్యాదుతో హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు పంపారు. ఈనెల 18లోపు విచారణకు హాజరు కావాలంటూ BNSS 45 కింద నోటీసులిచ్చారు. ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ఈ కేసురోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి పెంచుతుంది.

తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్‌తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరోపై నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదు అయ్యింది. రాజ్‌తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఏ 1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. తనను చంపేస్తామని బెదిరించి భయబ్రాంతులకు గురి చేసిన మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో ఎప్‌ఐఆర్‌లో ముగ్గురి పేర్లను పోలీసులు చేర్చారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద ముగ్గురిపైనా కేసు నమోదు అయ్యింది.

ఇదిలా ఉంటె రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా ఎపిసోడ్‌పై ముంబైకు చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఆమె హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పై సంచలన ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో తమ ఆస్తులన్నింటినీ లాక్కుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడంటూ తమ కుమారున్ని జైలుకు పంపించిందని వెల్లడించింది. యోగేష్ ను మాల్వీ ట్రాప్ చేసి ప్రేమలో పడేసిందని, ఆ తర్వాత ఆస్తులన్నింటినీ లాక్కుందని ఆరోపించింది. ఆ తర్వాత తప్పుడు కేసులతో తమ కుమారుడిని జైలుకు పంపించిందంని వాపోయింది. నాలుగేళ్లుగా మాల్వీ తమను ఇబ్బంది పెడుతోందంటూ కంటతడి పెట్టిందామె .

కాగా.. 2020లో ముంబైలో ఉన్నప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై యోగేష్ కత్తితో దాడి చేయడం సంచలనం సృష్టించింది. మాల్వీ పెళ్లికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడు జరిగిన అన్ని విషయాలను యోగేష్ తల్లి ఇప్పుడు మీడియా ఎదుట బయటపెట్టడం సంచలనం రేపుతోంది. మరి ఈ తీవ్రమైన ఆరోపణలపై రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఎలా స్పందిస్తారో చూడాలి.