Movie News

వెండితెరపైకి నమ్రత శిరోద్కర్ రీఎంట్రీ

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ రీఎంట్రీ ఇవ్వబోతుంది. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన నమ్రత శిరోద్కర్ 1993లో జరిగిన అందాల పోటీల్లో ‘మిస్ ఇండియా యూనివర్స్’, ‘మిస్ ఇండియా ఏషియా పసిపిక్’గా ఎంపికై సత్తా చాటుకుంది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో 1998లో ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. అనంతరం ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది.

బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే నమ్రత శిరోద్కర్.. మహేశ్ బాబు నటించిన ‘వంశీ’తో తెలుగులోకి వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘అంజీ’ అనే సినిమానూ చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఫలితంగా నమ్రత తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. ఇక వంశీ’ మూవీలో నటిస్తోన్న సమయంలోనే మహేశ్‌ బాబుతో నమ్రత లవ్‌లో పడింది. ఆ తర్వాత చాలా కాలం పాటు వీళ్లిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. అలా దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి, 2005లో వీళ్లు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని , తర్వాత ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ, సూపర్ స్టార్ వైఫ్ మూవీల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీటిని ఆమె ఖండించింది కూడా. అయితే, నమ్రత నిజంగానే మళ్లీ నటించబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్‌గా మారిపోయింది. ఓ పేరున్న ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో నటించే సినిమాతో ఆమె మళ్లీ తెరపై కనిపించనుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఆమె ఎవరూ ఊహించని విధంగా కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నారట. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాల్సి ఉంది.