టకిరీటి డా. రాజేంద్రప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చన కాంబినేషన్ లో రూపేష్,ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టి పూర్తి ‘ . పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మేస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో తొలిపాటను ఆస్కార్ విన్నర్ కీరవాణి రచించగా ఇటీవల విడుదల చేశారు.సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
రెండో పాటను ‘మాస్ మహారాజా’ రవితేజ ఆవిష్కరించి, యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ –“మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి.. డెఫినెట్ గా బావుంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. దర్శక నిర్మాతలకు,ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ది బెస్ట్ “ అని చెప్పారు.
”ఇరు కనులు కనులు కలిసి మురిసె మొదటి చూపులో తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో “…అంటూ రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ , విభావరి ఆలపించారు. ఆ విశేషాలను దర్శకుడు పవన్ ప్రభ తెలియజేస్తూ “సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా గారు బాణీ ఇవ్వగానే నాకు ‘సాగర సంగమం’ లో ‘మౌనమేలనోయి ‘పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది. ఈ ట్యూన్ కి రెహమాన్ శరవేగంతో సాహిత్యం సమకూర్చారు. ఇళయరాజా గారు ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఓకే చెప్పేశారు. ఎస్పీ చరణ్,విభావరితో ఈ పాట పాడించారు.
అసలు ట్యూన్ వినగానే నాదీ,రూపేష్ గారి మొహాలు వెలిగిపోయాయి. ఇక మొత్తం పాట రికార్డు అయ్యాక మా మొహాల్లో వెన్నెల కురిసినంత ఆనందం. అసలు ఈ పాట రికార్డింగ్ కూడా చాలా లవ్లీ గా ,లైవ్లీ గా జరిగింది. సింగర్స్ ఎవరిదారిన వాళ్ళు వచ్చి పాడి వెళ్లిపోకుండా ఇద్దరూ పక్క పక్కన నిలబడి ఓ ఫీల్ తో ఈ డ్యూయట్ ని ఆలపించారు. కధలో సమ్మిళితమైన ఈ పాట, ఈ సినిమాకే కొత్త అందాన్ని,అనుభూతిని తీసుకొచ్చింది. ఈ పాట చిత్రీకరణని రాజమండ్రి లో ఈశ్వర్ నృత్య దర్శకత్వంలో తీశాం. మంచి ఎండల్లో అందరూ కస్టపడి,ఇష్టపడి ఈ పాట బాగా రావడానికి సహకరించారు. ముఖ్యంగా మా ఛాయాగ్రాహకుడు రామ్ రెడ్డి. మామూలుగానే గోదావరి అందంగా ఉంటుంది. ఇక తోట తరణి గారి కళా దర్శకత్వ నైపుణ్యం వల్ల ఈ పాటలో గోదావరి రెట్టింపు అందంతో కనిపిస్తుంది. మా హీరో హీరోయిన్లు రూపేష్,ఆకాంక్ష సింగ్ లపై ఈ పాటను చిత్రీకరించాం” అన్నారు.
రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ , ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, ‘చలాకి’ చంటి, ‘బలగం’ సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ ఇందులో ప్రధాన తారాగణం.