Movie News

రామోజీ రావుకి ‘గేమ్ ఛేంజర్’ టీమ్ అశ్రు నివాళి

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఉదయం నుండి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివస్తు కడసారి రామోజీరావు ను చూసి..ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్ర యూనిట్ సెట్లో నివాళి అర్పించింది. రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకొంటున్న చిత్ర బృందానికి ఈ వార్త తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. “పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం.అయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు” అని తెలిపారు.

ఇక రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున రేపు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.